Play all audios:
రాజమహేంద్రవరం: అగ్ర కథానాయకుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) మూవీ విడుదల సమయంలోనే థియేటర్ల బంద్ అనే అంశం ఎందుకు తెరపైకి
తీసుకొచ్చారని ఏపీ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) ప్రశ్నించారు. ‘మాకు ప్రభుత్వంతో సంబంధం లేదు. మా నిర్ణయాలు మేము తీసుకుంటాం’ అంటున్న కొందరు, దానిని రాజకీయ లబ్ధి
కోసం వాడుకుంటున్న వైసీపీ.. కొన్ని వాస్తవాలను గ్రహించాలన్నారు. ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు అన్ని విధాలా సహకరిస్తుంటే ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో
మాట్లాడుతూ.. ప్రస్తుతం సినిమా పరిశ్రమ, ఏపీ ప్రభుత్వం మధ్య నెలకొన్న పరిస్థితులపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అల్లు అరవింద్ వ్యాఖ్యలు సహేతుకం ‘‘హరి హర వీరమల్లు’ మూవీ విడుదల సమయంలోనే
థియేటర్ల బంద్ విషయం ఎందుకు తెరపైకి వచ్చింది. ఆ టాపిక్ బయటకు వచ్చినప్పుడు తక్షణమే స్పందించి నిర్ణయాన్ని తెలియజేయాల్సింది కదా! ఏడాదిగా ఏపీ ప్రభుత్వం ఏనాడైనా మీ సినిమాలకు ఇబ్బంది కలిగించిందా?
సినీ నిర్మాతలు విడివిడిగా వచ్చి అడిగినా.. టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చాం. సమష్టిగా రండి. సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కరించుకుందాం. అల్లు అరవింద్గారి వ్యాఖ్యలు సహేతుకంగా ఉన్నాయి.
ప్రస్తుతానికి థియేటర్ల బంద్ లేదన్నారు కాబట్టి, సమస్య సమసిపోయినట్లే. భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కార్యాచరణ అవసరం. పరిశ్రమకు తొలి నుంచి గౌరవమిస్తూ, ఉమ్మడి రాష్ట్రంలోనూ
ఇప్పుడూ చలన చిత్రాభివృద్ధి జరగాలని కృషి చేసిన వ్యక్తి చంద్రబాబునాయుడుగారు. ఆ రోజుల్లోనే ఆయనకున్న పరిచయాల ద్వారా వివిధ కార్యక్రమాలను చేపట్టారు.’’ * పవన్ మూవీ వేళ అది దుస్సాహసమే.. ఆ నలుగురిలో
నేను లేను: అల్లు అరవింద్ అది వారి అహంకారమే.. ‘‘ప్రతి సినిమా విడుదలకు సదరు నిర్మాతలు నా దగ్గరకు వచ్చి టికెట్ రేట్లు పెంచాలని కోరుతున్నారు. ఏ చిత్రం అయినా బడ్జెట్ను చూసి ధరలు పెంచమని
అభ్యర్థిస్తున్నారు. మేము సంబంధిత శాఖతో మాట్లాడి చెబుతున్నాం. అందరూ ఓ విషయం అర్థం చేసుకోవాలి. పరిశ్రమకు సంబంధించిన అంశాలు సినిమాటోగ్రఫీశాఖ పరిధిలో ఉన్నప్పటికీ థియేటర్లు, టికెట్ ధరల పెంపును
హోంశాఖ ముఖ్య కార్యదర్శి చూస్తారు. సినిమా రంగానికి సహకారం అందించాలని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చెబుతూనే ఉన్నారు. తగిన సూచనలు సైతం చేస్తున్నారు. వాటికి అనుగుణంగా టికెట్ ధరల పెంపు విషయంలో
నిర్ణయం తీసుకుంటున్నాం. అయితే, పెంచిన రేట్లపై కొందరు కోర్టులో పిల్ దాఖలు చేస్తున్నారు. దీంతో ప్రతి సినిమాకు ప్రిన్సిపల్ సెక్రటరీ లేక సంబంధిత శాఖకు చెందిన అధికారులు కోర్టుకు వెళ్లి సమాధానం
చెప్పాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రేట్ల పెంపును ఆమోదించడానికి ఇబ్బంది పడుతున్నా.. సినిమా పరిశ్రమకు సహకరించాలనే ఉద్దేశంతో ఏడాది కాలంగా అనుమతులు ఇస్తున్నాం. అయితే, కొంతమంది ‘మా సమస్యలు
మేమే పరిష్కరించుకుంటాం, బయట వారు ఎవరూ రావొద్దు’ అంటున్నారు. అది అహంకార పూరితంగా అనిపిస్తోంది. ఎవరి ప్రోద్బలంతో ఇలా అంటున్నారో తెలియదు’’ అసలు ఆయనకు మానవత్వం ఉందా? ‘‘గత ప్రభుత్వం అగ్ర
హీరోలందరినీ పిలిచి ఏ విధంగా అవమానించిందో అందరం చూశాం. అప్పుడు మంత్రులుగా పనిచేసిన వారు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ‘సినిమా అనేది వ్యాపారమని, దానికి సంబంధించిన నిర్ణయాలు వాళ్లే
తీసుకుంటారు’ అని అంటున్నారు. అప్పుడు మీరు చేసిన నిర్వాకాలు ఏంటో అందరికీ తెలుసు. సినిమాకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వ సహకారం ఏదో ఒక స్థాయిలో కచ్చితంగా ఉంటుంది. ఆ మాజీ మంత్రి వ్యాఖ్యలు
చూస్తుంటే.. అసలు మానవత్వం ఉందా?అనిపిస్తోంది. ఒక పోరాట యోధుడి కథతో రూపొందిన చిత్రం ‘ఫ్లాప్ మూవీ’ అంటున్నారు. సినిమా విడుదల కాకముందే స్టేట్మెంట్ ఇచ్చారంటే.. ఆయన ఎంతమంది కుటుంబాలతో
ఆడుకున్నాడో అర్థమవుతోంది. బాధ్యత కలిగిన మంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవి? ఎదుటి వ్యక్తి చనిపోవాలని కోరుకోవడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నావా? అసలు నీకు మానవత్వం ఉందా?
ఇలాంటి వారే ‘జంతు సమాన.. మూర్ఖత్వానికి నమూనా..’ అని జంధ్యాలగారు ఎప్పుడో చెప్పారు. ప్రజలందరూ మీ చర్యలను గమనిస్తున్నారు’’ * మీకు కనీస కృతజ్ఞత లేదు.. సినిమా వాళ్లెవరూ వ్యక్తిగతంగా రావద్దు:
డిప్యూటీ సీఎం పవన్ సినిమా రంగం అభివృద్ధికి పాలసీ ‘‘సినిమా రంగానికి సహకరిస్తున్నప్పుడు మీరు వచ్చి కలిస్తే సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కలవటం, కలవకపోవటం వారి విజ్ఞతకే
వదిలేశాం. వారు రాలేదని మేమెప్పుడైనా సినిమాలను అడ్డుకున్నామా? మనందరం కలిసి సమస్యలు పరిష్కరించుకుందామని నేను లేఖరాశాను. సినిమా ఇండస్ట్రీకి ఒక పాలసీ తీసుకొద్దామని అంటున్నాం. ఎగ్జిబిటర్లకు
సమస్యలు ఉన్నాయి. సింగిల్ థియేటర్ల వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటివి పరిష్కరించుకోవడానికి ఓ విధానం తీసుకొస్తామని చెబుతున్నాం. అలాగే మల్టీప్లెక్స్లో టికెట్, తినుబండారాల ధరలపైనా విధి
విధానాలు రూపొందించబోతున్నాం. ఇందుకు సంబంధించి విచారణకు ఆదేశించాం. నివేదిక వచ్చిన తర్వాత దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటాం. గత ప్రభుత్వంలా కక్షసాధింపు చర్యలు మాత్రం ఉండవు’’అని కందుల దుర్గేష్
అన్నారు.