Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ (Pakistan) ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ చైనా పర్యటనకు సిద్ధమయ్యారు. సోమవారం బీజింగ్కు (China) వెళ్లనున్న ఆయన.. చైనా విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక
చర్చలు జరపనున్నారు. ఇదే సమయంలో అఫ్గాన్ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ కూడా చైనాకు వెళ్లనున్నారు. మే 20న వీరు త్రైపాక్షిక చర్చలు జరపనున్నట్లు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. ‘‘ప్రాంతీయ
వాణిజ్యాన్ని పెంపొందించడం, మెరుగైన భద్రతా సహకారం, ఇటీవల ఈ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులు.. ముఖ్యంగా భారత్-పాక్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ మూడు దేశాల విదేశాంగ మంత్రులు చర్చలు
జరపనున్నారు’’ అని పాక్ మీడియా కథనాలు వెల్లడించాయి. మే 10న కాల్పుల విరమణ అవగాహన అనంతరం పాక్ మంత్రి విదేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి. * భారత్లో ఉగ్రదాడుల వ్యూహకర్త.. పాకిస్థాన్లో హతం
భారత్-పాక్ల మధ్య జరిగిన తాత్కాలిక ఒప్పందాన్ని చైనా స్వాగతించిన విషయం తెలిసిందే. ఈ అవగాహన రెండు దేశాలకు ప్రయోజనకరమని, ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి అనుకూలమైందని పేర్కొంది. ఇదే సమయంలో భారత్
కూడా అఫ్గాన్ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపింది. పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించడాన్ని స్వాగతించింది. మరోవైపు అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ తీరును ఎండగట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన
భారత్.. పలు అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.