Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ (Ukraine-Russia War) మధ్య కాల్పుల విరమణ కోసం ఒకవైపు మంతనాలు జరుగుతున్న వేళ కీవ్పై మాస్కో భారీ దాడులకు పాల్పడుతోంది. వీటిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు
జెలెన్స్కీ (Zelensky) మాట్లాడుతూ.. మూడు రోజులుగా తమ దేశంపై క్షిపణులతో పాటు 900కు పైగా డ్రోన్లతో దాడులు జరిగాయన్నారు. మాస్కో నేతలతో ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరుపుతున్నప్పటికీ.. దాడులు
ఆగడంలేదని విమర్శించారు. అసలు ఈ యుద్ధం ఆపాలనే ఆలోచనే పుతిన్ (Putin)కు లేదన్న విషయం స్పష్టమవుతోందని అన్నారు. కీవ్పై మరిన్ని క్షిపణులు ప్రయోగించడానికి మాస్కో సన్నద్ధం అవుతున్నట్లు నిఘా
వర్గాలు తెలిపాయని జెలెన్స్కీ పేర్కొన్నారు. తాజాగా జరిగిన భారీ వైమానిక దాడుల్లో ఉక్రెయిన్లోని ఐదు ప్రదేశాలు, పలు వాణిజ్య, నివాస భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. మిలిటరీ స్థావరం ఉన్న
పశ్చిమ ప్రాంతంపై రష్యా ఏడు క్రూయిజ్ క్షిపణులు, పెద్ద మొత్తంలో డ్రోన్లను ప్రయోగించిందన్నారు. ఇకనైనా దాడులకు పాల్పడకుండా రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా, యూరప్లు ఆ దేశంపై కఠిన ఆంక్షలు
విధించాలని కోరారు. * హార్వర్డ్పై పోరాటంలో విజయం సాధిస్తా: ట్రంప్ కీలక వ్యాఖ్యలు యుద్ధ ఖైదీల అప్పగింతలో భాగంగా శుక్రవారం రష్యా-ఉక్రెయిన్ 390 మందిని, శనివారం 307 మందిని మార్పిడి
చేసుకున్నాయి. తాజాగా మరో 303 సైనికులను పరస్పరం అప్పగించుకున్నట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. మరోవైపు కీవ్తోపాటు ఇతర ప్రాంతాలపై మాస్కో భీకర దాడులు చేస్తోంది. ఆదివారం రాత్రి ఒకేరోజు 69
క్షిపణులతో పాటు 298 డ్రోన్లతో విరుచుకుపడింది. వీటిలో ఇరాన్ రూపొందించిన షాహిద్ డ్రోన్లు కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ఈ దాడుల్లో 12 మంది చనిపోగా.. పలువురు గాయాలపాలయ్యారు. ఇటీవల అమెరికా
అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) మీడియాతో మాట్లాడుతూ.. ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. పుతిన్ పూర్తిగా పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. జెలెన్స్కీ మాటలతో సమస్యలు మరింత
తీవ్రమవుతున్నాయని అన్నారు.